ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్‌రెడ్డి.. కామారెడ్డి మహిళలకు ఇందిరమ్మ ఇళ్లు

  • ఇళ్లు కట్టిస్తానని పాదయాత్రలో హామీ
  • సీఎం అయ్యాక ఇందిరమ్మ పథకం కింద గృహ నిర్మాణం
  • నేడు నూతన గృహప్రవేశం చేయనున్న లబ్ధిదారులు
రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు కేవలం ఓట్ల కోసమే కాదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇద్దరు నిరుపేద మహిళలకు ఇచ్చిన హామీని, ముఖ్యమంత్రి అయ్యాక గుర్తుంచుకుని నెరవేర్చారు. వారి సొంతింటి కలను సాకారం చేసి తన మాట నిలబెట్టుకున్నారు.

2023 మార్చి నెలలో రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చేరుకుంది. ఆ సమయంలో భిక్కనూర్ లక్ష్మి, రాజమణి అనే ఇద్దరు మహిళలు ఆయనను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. భారీ వర్షాలకు తమ ఇళ్లు పూర్తిగా కూలిపోయాయని, నిలువ నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. వారి దీనస్థితికి చలించిన రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇళ్లు కట్టించే బాధ్యత తనదని ఆనాడే భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పాలనలో బిజీగా ఉన్నప్పటికీ, ఆ మహిళలకు ఇచ్చిన మాటను రేవంత్ మర్చిపోలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి, వారికి ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. షబ్బీర్ అలీ ప్రత్యేక చొరవ తీసుకుని, బాధితులకు 'ఇందిరమ్మ ఇళ్లు' మంజూరు చేయించారు. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు పూర్తి చేయడంతో, ఆ మహిళలు శనివారం (నేడు) తమ నూతన గృహాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఒక సాధారణ కార్యకర్తలా ఇచ్చిన హామీని సీఎం హోదాలో నిలబెట్టుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Revanth Reddy
Telangana CM
Indiramma Houses
Kamareddy
Shabbir Ali
Congress Party
Housing Scheme
Telangana Politics
Bhikkannur Lakshmi
Rajamani

More Telugu News